https://www.clickmagick.com/share/1485142037427

శంకరచరితామృతము : మండనమిశ్రులపై విజయం

వ్యాసులవారు ఆదేశించినట్లు శ్రీ శంకారాచార్యులవారు దిగ్విజయం గావించారు. దిగ్విజయానికై ఆచార్యులవారు మున్ముందు తూర్పుగా పయనించేరు. ఆచార్యులవారు దిగ్విజయానికై బయలుదేరి ప్రయాగకు వెళ్ళి అప్పటికే తుషాగ్ని ప్రవేశం గావించి ఉన్న కుమారిలభట్టును కలిసికొన్నారని, కేవలం కర్మ మార్గాన్ని అనుసరించడం వల్ల ప్రయోజనం ఉండదని వారికి బోధించి వారిచే జ్ఞానమార్గం అంగీకరింపజేసారని, కుమారిలభట్టు మండనమిశ్రులను జ్ఞానమార్గావలంబులుగా చేయడంవల్ల ఎక్కువ మేలు కలుగుతుందని ఆచార్యులకు చెప్పేరని వెనుక చెప్పుకొన్నాము. మరిన్ని వివరాలకై ఈ వ్యాసము చూడండి: కుమారస్వామి అపరావతారమైన కుమారిలభట్టు

మండనమిశ్రుల వారి భార్య పేరు ఉభయ భారతీదేవి. ఆ దంపతులు సరస్వతీ చతుర్ముఖుల అవతారములు. మండనమిశ్రులు, కుమారిలభట్టు, జైమిని – ఈ ముగ్గురు మీమాంస మతానికి చెందినవారు. వేదంలోని కర్మకాండయే ముఖ్యమైనదని మీమాంస మత సిద్దాంతం. చతుర్ముఖుని అంశతో జన్మించిన మండనులు, బౌద్ధులను వారి మతాన్ని నిరసించి ఖండించి క్రమంగా తాము మీమాంసకులై మతానికి ఆ కాలంలో వెన్నెముకగా ఉన్నారు.

మీమాంస మత సిద్దాంతం ఏమంటే? – భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ఆలోచన అనవసరం, ఉంటే ఉండనీయి, లేకుంటే లేకపోనీయి, అది ప్రయోజనం లేని ఆలోచన. వేదంలో చెప్పబడ్డ కర్మలను ఆచరించండం నీవు చేయవలసిన పని. ఆ కర్మలను ఆచరించు. అవి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇట్టి మత సిద్ధాంతాలలో విశ్వాసం కలవారై మండనమిశ్రుల వారు మాహిష్మతీ నగరంలో నివసిస్తున్నారు.

కుమారిలభట్టు చెప్పిన మాటలు విని శ్రీ శంకరులు మండనమిశ్రులను వెదకుకొంటూ వారు నివసించే మాహిష్మతీ నగరానికి చేరుకొన్నారు. నిత్యమైన ఆనందమేదో తెలియక, కర్మనే నమ్ముకొని, అనవరతం కర్మాచరణంలోనే కొట్టుమిట్టాడుతూ, తత్ఫలితంగా అనిత్యమై అల్పమైన ఆనందాన్ని అనుభవిస్తూ, మరల మరల జన్మించుటయే జీవతపరమావధిగా భావించి యున్న మండనమిశ్రులను వారి అనుయాయులను ఏదో విధంగా తరింపజేయాలన్న అనుగ్రహబుద్ధితో శ్రీ శంకరులు అక్కడకు వచ్చేరు.

మాహిష్మతిలో మండనమిశ్రుల గృహాన్ని వెదకుకొంటూ శ్రీ శంకరులు వస్తున్నారు. వారికి నది నుండి నీటి బిందెలతో వస్తూ ఉన్న పౌరపురంధ్రులు కాన వచ్చేరు. వారా వనితలను మండనమిశ్రుల యింటికి మార్గమేది? అని ప్రశ్నించేరు. అప్పుడు వారు

స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కీరాంగనా యత్ర గిరం గిరన్తి|
ద్వారస్థ నీడాంతర సం నిరుద్ధా జానీహి తన్మండన పండితౌకః||

ఏ గృహ ద్వారమందు పంజరబద్ధములైన చిలుకలు- ‘వేదము స్వతః ప్రమాణమా? లేక పరతః ప్రమాణమా?’ అని వల్లె వేస్తూ ఉంటాయో అదే మండనుల ఇల్లు – అని సమాధానం యిచ్చేరు.

స్వతఃప్రమాణ – పరతః ప్రమాణాల స్థూల స్వరూపం -పంచదారను (లేక) దీపాన్ని చూచినప్పుడు ‘ఇది పంచదార’ ‘ఇది దీపం’ అన్న జ్ఞానం మొదట కలుగుతుంది. దానికి వెనువెంటనే ‘అవును! ఇది నిజం’ అని మరియొక జ్ఞానం కలుగుతుంది. ఇది అరటిచెట్టు’ అని తెలియగానే ‘అవును! ఇది నిజం!’ అన్న రెండవ జ్ఞానం కూడా పుడుతోంది. అరటిచెట్టును చూడగానే కలిగిన యీ రెండవ జ్ఞానానికి అరటిచెట్టును చూచుటయే కారణమా లేక వేరొకదానివల్ల ఆ జ్ఞానం కలుగుతోందా? అంటే అరటిచెట్టు చూచుటయే యీ రెండవ జ్ఞానానికి కారణం అనేవారు స్వతః ప్రమాణం వాదులు, అలాకాదు, వేరొకదానివల్ల యీ రెండవ జ్ఞానమేర్పడుతోంది, అనేవారు పరతః ప్రమాణవాదులు.

శంకరులు మండనుల యింటికి వచ్చేసరికి వారి గృహకవాటాలు మూయబడి ఉన్నాయి. అందుచే వారు యోగశక్తితో గృహంలో ప్రవేశించేరు. ఆ రోజున మండనుల యింటిలో శ్రాద్ధము. లోపల వ్యాసులవారు, జైమిని బ్రాహ్మణార్థమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యులవారిని చూడగానే మండనమిశ్రులకు చాలా కోపం వచ్చింది. అప్పుడు శంకరులను మండనులకు వాగ్వాదం జరిగినట్లు కథలు జనశ్రుతిలోను గ్రంథాలలోనూ ఉన్నాయి. వ్యాస, జైమినులు వారిని సమాధానపరచి మండనమిశ్రులతో – ‘శ్రాద్ధమునకు సన్యాసిని పిలువాలని’ శాస్త్రం చెపుతూ ఉన్నది. అందుచే విష్ణువునకు ఉద్ధేశించిన విస్తరలో ఆచార్యులవారిని కూర్చుండబెట్టి పూజించు అని చెప్పేరు.

మండనమిశ్రులకు ఏమీ పాలుపోలేదు. ఈ వ్యాస,జైమినులు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు. బ్రాహ్మణార్థమునకు వచ్చినవారు చెప్పినట్లు చేయాలని శాస్త్రం. సన్యాసిని చూడడానికైనా అంగీకరించని తనను సన్యాసిని శ్రాద్ధ సమయంలో పూజించవలసిందిగా వారు ఆదేశిస్తున్నారు. ఏం చేసేది? వారు బ్రాహ్మణార్థమునకు వచ్చేరు, వారి మాట విని తీరాలి. వినకపోతే దోషం. అందుచే మండనులు శంకరులతో వాదం విరమించి భిక్షకు రావలసినదిగా అర్థించేరు. అపుడు శంకరులు నేను కోరేది వాదభిక్ష, సాధారణభిక్ష నాకు అక్కరలేదు, అన్నారట! ఆచార్యులవారు వాదభిక్ష కోరినంతనే మండనులు ‘మొదట యీ భిక్ష స్వీకరించండి, తరువాత వాదభిక్షను గూర్చి గమనిద్దాం’ అన్నారు.

వాదం అంటే ఈ రోజులలో వివాదము లేక జగడం అనుకొనడం పరిపాటి అయింది. కాని అది సరికాదు. అది ‘జల్పం’ అనబడుతుంది. తెలియనిదానిని తెలిసికొనడానికి లేదా తత్త్వ గ్రహణానికి చేయబడే సమాలోచనకు వాదం అని పేరు. ‘తనకు తెలిసినదే యథార్థమైనది, ఇతరులు చెప్పేది యధార్థం కాదు, అన్న నిశ్చయజ్ఞానంతో చేయబడేది ‘జల్పం’, ఈ రెండేకాక మూడవది మరియొకటి ఉన్నది అది ‘వితండవాదం’. తనకు ఏ అభిప్రాయామూ లేకపోయినా ఎదుటివాడుచెప్పేది అంతా తప్పు అనడమే వితండవాదం.

శ్రాద్ధం సమాప్తం అయినంతనే ఇరువురూ వాదించుటకు ఆరంభించేరు. సరస్వతీదేవి యొక్క అవతారమైన మండనమిశ్రులవారి భార్య ఉభయ భారతీదేవిని ఇరువురి వాదాలను ఆలకించి తీర్పు చెప్పడానికి మధ్యస్థురాలుగా ఎన్నుకొన్నారు. ఆమె ఇరువురికి చెరి యొక మాలను యిచ్చి ఎవరి మాల వాడిపోతే వారు పరాజితులైనట్లు అని నిర్దేశించింది. వాదారంభానికి ముందు శంకరులు మండనులు ఒక నిబంధన ఏర్పరుచుకొన్నారు. వాదంలో శంకరులు జయిస్తే మండనులు సన్యాసం స్వీకరించాలి. మండనులే జయిస్తే శంకరులు ప్రాయాశ్చిత్తం చేసుకొని గృహప్రస్థాశ్రమం స్వీకరించాలి.

వాదం ఇరువదియొక్క రోజులు సాగింది. ఇరవై ఒకటవ రోజున మండనమిశ్రుల మెడలోని మాల వాడిపోయింది. వెంటనే ఉభయ భారతీదేవి ఇద్దరిని భిక్షాగ్రహణానికి దయచేయండి అని ఆహ్వానించింది. నాటితో మండనులు సన్యాసులయ్యారు. సురేశ్వరాచార్యులు అన్నది ఆయన సన్యాసాశ్రమ నామధేయం. సురేశ్వరులవారు ‘నైష్కర్మ్యసిద్ది’ అనే గ్రంథాన్ని రచించేరు. అందులో వారు ‘కర్మ ఫలాన్నే కాకుండా వేదం ఒక అత్యున్నతమైన ఆనందాన్ని సూచిస్తోంది’ అని సిద్ధాంతీకరించారు.

మండనులను ఆచార్యుల వారు ఏ విధంగా జయించేరు?

‘శబ్డం కార్యాన్ని నిర్దేశించాలి’ అని కదా మీమాంసకుల అభిప్రాయం. శంకురులు- ‘అలాకాదు, శబ్దం కార్య ప్రయోజనానికి సహాయకారిగా ఉండాలి’ – అన్నారు. ఏమంటే కొన్ని చోట్ల కార్యము లేకపోవుటయే శబ్దానికి ప్రయోజనం అవుతుంది. ‘సురాపానం చేయరాదు అన్నాము. ఈ శబ్దం వినగానే చేయవలసిన కార్యం ఏమీ ఉండడం లేదు కదా! అందుచే శబ్దానికి ఒక్క ప్రయోజనమే లక్షణం అని అంగీకరించడం తగినది కాని కార్యనిర్దేశర శబ్ద తాత్పర్యంగా ఉండాలి. అనుకొనడం తగదు’- అన్నారు.

‘సురాపానం చేయరాదు’ అన్న మాటకు ఏదో చేయుమని కాక ఏమీ చేయవద్దూ అన్నదే తాత్పర్యమై ఉన్నది. ఏమీ లేకపోవవడాన్ని అభావం అంటారు. నిషేధ వాక్యాలన్నీ కార్యాభావాన్ని బోధిస్తాయి. ఏదో ఒక కార్యము చేయకపోవుటయే ఒక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఏ కార్యమయినా చేయక పోవడం, ఏ కార్యము లేకుండా ఉండడం ఒక పెద్ద ప్రయోజనంగా ఉండాలి. ఏ కార్యము లేక పోవుటయే పరమ ప్రయోజనంగా కలవైనందున వేదాంతశబ్దాలు అన్నిటికి శిఖరాయమాణాలై ఉన్నాయి.

‘సర్వం కర్మాఖిలం పార్ధ! జ్ఞానే పరి సమా ప్యతే’ – అని గీతలో చెప్పబడిఉంది. అన్ని కర్మలూ పరమేశ్వరుని యందు వినియోగం పొందాలి. కార్యము (చేయవలసినది లేకపోవుటయే) లేకపోవుటయే పరమప్రయోజనం అదియే బ్రహ్మానందం. దానిచే మరి జన్మ ఏర్పడదు. వేదానికి పరమతాత్పర్యం ఇదే! కర్మ కాండము సర్వాన్నీ జ్ఞానకాండలోనికి సమన్వయించు కోవాలి. అపుడే దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అని శంకరులు మండనమిశ్రులవారికి బోధించేరు.

మండనులు ఆచార్యుల వారికి శిష్యులైనంతనే సరస్వతి (అనగా ఉభయ భారతీదేవి) ఇక నాకేమి పని ఉన్నదని బయలుదేరింది. అపుడు శంకరులు ఆమెను వారించి- ‘నీవును ఇక్కడనే ఉండు, శారదా పీఠముగా నీవు ఉందువుగాక!’ అని ఒక పీఠాన్ని స్థాపించి సరస్వతిని ఆ పీఠంలోనికి ఆహ్వానించేరు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *