https://www.clickmagick.com/share/1485142037427

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాముని మాటను జవదాటని లక్ష్మణుడు ఈ ప్రదేశంలో రామునికి ఎదురు చెప్పినాడట. రాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.

ఈ కొండపై రాముని గుడి వెలసింది. నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడని ఇతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన హాజరయ్యేవాడని అంటారు. ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయాడని అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.

నాగాభరణం…

వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు. అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. తెలుగులో నాగలు అంటే నాగలమడక అని కన్నడంలో నేగిలు అని అర్థం.

ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది. కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.

పుల్లివిస్తర్ల విశిష్టత…

ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం. స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.

ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుమకూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.

ఇటీవల నిర్వహించిన పాల పొంగుల షష్ఠి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అయితే ఈ సారైనా విస్తర్లు మోసి మొక్కులు తీర్చుకుందామని షష్ఠికి తరలివచ్చిన వేలాది మంది భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. కేవలం దేవుడిని దర్శించుకుని పూజలతో సరిపెట్టుకున్నారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వేద మంత్రాల మధ్య భోజన మంటపంలోని తరలించి అన్నం రాశిపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని బ్రాహ్మణులు ఆరగించారు.

పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు…

కర్నాటక రాష్ట్రం పావగడకు 16 కి.మీ. దూరంలో ఉత్తర పెన్నా(పినాకిని) నదీతీరం ఒడ్డున నాగలమడక తీరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. అంకురార్పణ, ధ్వజారోహణ, కళ్యాణోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి బ్రహ్మోత్సవం, రథోత్సవం, సుబ్రహ్మణ్య షష్టి, అభిషేకం, బ్రాహ్మణుల అన్న సంతర్పణ, రాత్రి 7 గంటలకు గజ వాహనోత్సవం, పంచామృత అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి రాకపోకలకు రవాణా సౌకర్యం అనుకూలంగా ఉంది. నాగలమడక ఉత్సవానికి అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు. బెంగళూరు నుంచి 163 కి.మీ. దూరంలో వుంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: పావగడ నగలమడికే – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *