https://www.clickmagick.com/share/1485142037427

ఘాటి సుబ్రహ్మణ్య స్వామి

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

‘ఘాటి సుబ్రహ్మణ్య స్వామి’ క్షేత్ర నేపథ్యం విషయానికి వస్తే, ఈ ప్రదేశంలో ‘ఘటికాచలుడు’ అనే అసురుడిని సంహరించిన స్వామి, దేవతల కోరికపై ఇక్కడ ఆవిర్భవించాడు. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడికి తన ఉనికిని తెలియజేసిన స్వామి వెలుగులోకి రావడం జరిగింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన విశిష్టమైన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో ఇది ఒకటిగా విలసిల్లుతోంది.

ఘటికాచలుడు అనే అసురుడిని స్వామి వారు ఈ ప్రదేశంలో సంహరించిన కారణంగానే ఈ క్షేత్రంలోని స్వామివారిని ఘాటి సుబ్రహ్మణ్యస్వామిగా కొలుస్తుంటారు. ఒక్కో క్షేత్రంలో స్వామి వెలుగు చూసినతీరు ఆ స్వామి మహాత్మ్యానికి అద్దం పడుతుంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

ఇక్కడ గుడి విశిష్టత ఏమిటంటే ఒకే చోట తూర్పు వైపుగా సుబ్రహ్మణ్య స్వామి , పడమర వైపుగా నరసింహ స్వామి వెలిసారు . సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునేటప్పుడు నరసింహ స్వామి ని అద్దం లో చూడవచ్చు , అలా ఇద్దరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు.

స్వామివారు ఎక్కడ ఆవిర్భవించినా ఆ స్వామి అనుగ్రహంతో సర్పదోషాలు, గ్రహ సంబంధమైన దోషాలు, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారిపట్ల విశ్వాసంతో మొక్కుకునేవారు, కృతజ్ఞతలతో మొక్కుబడులు చెల్లించుకునేవారు ఈ క్షేత్రాల్లో కనిపిస్తుంటారు.

ఒక్కో క్షేత్రంలో భక్తులు స్వామివారికి మొక్కుబడులు చెల్లించే పద్ధతి ఒక్కోలా ఉంటుంది. మోపిదేవి క్షేత్రంలో ‘ఉయ్యాల ఊపు’ మొక్కు ప్రధానమైనదిగా కనిపిస్తుంది.
ఇతర సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామివారికి ‘వెండి కళ్లు’, ‘వెండి పడగలు’ మొక్కుబడిగా చెల్లిస్తుండటం ఎక్కువగా ఉంటుంది.


ఇక ఘాటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ‘తులాభారం’ ద్వారా మొక్కుబడులు చెల్లించుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. స్వామివారికి బెల్లం, అరటిపండ్లు ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతుంటారు. అందువలన తులాభారం తూగి తమ బరువుకి తగిన బెల్లం, అరటి పండ్లను మొక్కుబడిగా స్వామివారికి చెల్లిస్తుంటారు. ఆయన చల్లని చూపు సదా తమపై ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగళూరు -యలహంక -దొడ్డబల్లాపూర్ రోడ్డు మార్గంలో ఉంది. యలహంక నుంచి 38 కి.మీ. దూరంలో వుంది. దొడ్డబల్లాపూర్ నుంచి ఆటో సదుపాయం కలదు.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – ఘాటి:


ఘాటి సుబ్రహ్మణ్య స్వామి – నిజరూప దర్శనం

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *